హుజూరాబాద్ నియోకవర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి సోమవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తన రాజీనామా లేఖను పంపారు. “కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు ఇన్నేళ్ళుగా అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి గత ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభా స్థానానికి టికెట్టు కూడా ఇచ్చి ప్రోత్సహించిన రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నాను” అని సోనియా గాంధీకి రాసిన లేఖలో కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
ముందుగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో హుజురాబాద్ లో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడినట్టుగా ఓ ఆడియో క్లిప్ వైరల్ అయింది. దీంతో తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా సంఘం కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా కౌశిక్ రెడ్డి ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ