ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జూన్ 7వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. ముందుగా షెడ్యూల్ ప్రకారమే జూన్ 7 నుంచి జూన్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావించగా, రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు దృష్ట్యా పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా ఉధృతి తగ్గని కారణంగా పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని, కరోనా తగ్గుముఖం పట్టాక మళ్ళీ సమీక్షించుకుని త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. “విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహించాలని భావించాం. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరం. పరీక్షలు రద్దు చేయవద్దని జరపాలని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు కోరారు. కరోనా తగ్గుముఖం పట్టని కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని సీఎం 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు. కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణ పై నిర్ణయం తీసుకుని త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తాం. విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నాం. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు ఉంటాయి. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్ కి రావాల్సిన అవసరం లేదు. పలువురు ఉపాధ్యాయులు కరోనాకు ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపం తెలుపుతున్నాం” అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ