అక్టోబర్ 2వ తేదీన విజయవాడలో క్లాప్, జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. బుధవారం నాడు ఆయన తాడేపల్లిలోని పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఆసరా, చేయూత, జగనన్న స్వచ్ఛసంకల్పంపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డ్వామా పిడిలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల పాటు క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యంగా పనిచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆశయమన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని, జగనన్న స్వచ్ఛసంకల్పంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు.
గతంలో పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన పచ్చదనం-పరిశుభ్రతా పక్షోత్సవాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, గ్రామాల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. ముఖ్యంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాలకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం అందిస్తుందని, అయితే ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ సంకల్పం విజయవంతం అవుతుందన్నారు. మరోవైపు అక్టోబర్ 7వ తేదీన సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ