ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత రెబల్స్టార్ కృష్ణంరాజు గౌరవార్ధం ఆయన పేరు మీద ఒక స్మృతి వనం ఏర్పాటు చేయటానికి నిశ్చయించుకుంది. ఈ మేరకు ఏపీ మంత్రులు కారుమూరి నాగేశ్వర రావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఆర్కే రోజా తదితరులు గురువారం ప్రకటించారు. కాగా కృష్ణంరాజు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఆయన నివాసానికి వచ్చిన మంత్రులు, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. టాలీవుడ్ హీరో ప్రభాస్, కృష్ణంరాజు సతీమణి శ్యామల, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సంస్మరణ కార్యక్రమం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తుగా స్మృతివనం ఏర్పాటుకు రెండెకరాల స్థలం కేటాయించనున్నట్లు మంత్రి కారుమూరి ప్రకటించారు. దీనికోసం మొగల్తూరు తీరప్రాంతంలో రాష్ట్ర టూరిజం డిపార్టుమెంట్ తరపున రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ స్మృతివనం ఏర్పాటుకు సహకరిస్తుందని, దీనికి సంబంధించి కృష్ణంరాజు కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించామని ఆర్కే రోజా వెల్లడించారు. ఇక కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి ప్రభాస్ నేడు మొగల్తూరు వస్తున్నారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో బయటకు వచ్చిన ప్రభాస్ వారికి అభివాదం చేసి, వచ్చిన వారందరినీ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY