తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం నాటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని సోమవారం కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు వరదల పరిస్థితిని మంత్రులు, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 12 గంటల పాటు సమీక్ష సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో, అప్రమత్తతతో వుండాలని సీఎం ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా వుండాలన్నారు. రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడుతూ ఆరా తీసారు. వరద ముప్పు వున్న జిల్లాల అధికారులతో మాట్లాడి, పరిస్థితులను అంచనా వేశారు. గోదావరిలో వరద పరిస్థితిని, నదీ ప్రవాహాన్ని, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సమాచారాన్ని స్క్రీన్ మీద పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం తగు సూచనలు చేశారు. వరద పెరగడం ద్వారా రిజర్వాయర్లకు చేరే బ్యాక్ వాటర్ తో ముంపుకు గురికాకుండా చూసుకోవాలని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావుకు సీఎం సూచించారు. మరో వారం పది రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెల్లవద్దన్నారు. వరదల నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పాటు జిహెచ్ఎంసీ, మున్సిపల్ ప్రాంతాల పరిధిలో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీములు సహా హెలికాప్టర్ లను సిద్ధం చేసుకోవాలని సీఎం సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
గత రెండు రోజులుగా వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన రక్షణ చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. నిజామాబాద్, ములుగు రామన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయినా పరిస్థితి అదుపులోనే వుందని అధికారులు సీఎంకు వివరిచారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం మరోమారు స్పష్టం చేశారు. ప్రాణహిత, ఇంద్రావతి వంటి గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించిన పరిస్థితిలో రేపు కూడా భద్రాచలంలోనే వుండి పరిస్థితులను ఎప్పడికప్పుడూ పర్యవేక్షించాలని, భద్రాచలం పర్యటనలో వున్న స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను సీఎం ఫోన్లో ఆదేశించారు. భద్రాచాలంలో పరిస్థితిని ఆరా తీసారు.
వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు వారి వారి జిల్లా కేంద్రాలు స్థానిక ప్రాంతాలను విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని స్థానిక మంత్రి శ్రీ జగదీష్ రెడ్డిని సీఎం ఆదేశించారు. గోదావరి వరదల నేపథ్యంలో నిజామాబాద్ అదిలాబాద్ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని, స్థానిక మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలకు సీఎం ఆదేశించారు. గడ్డెన్న వాగు, స్వర్ణ వాగుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 శాతం మేరకు నిర్వహిస్తూ అధిక వరదను ఎప్పటికప్పుడు కిందికి వదిలేలా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అంజయ్య యాదవ్, కృష్ణ మోహన్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి, నోముల భగత్, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, పీసిసిఎఫ్ డోబ్రియాల్, సీఎంఓ కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY