ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 చికిత్సలో భాగంగా మందుల వాడకంపై ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా బాధితులకు మందుల వినియోగంపై ఐసీఎంఆర్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల పాటించాలన్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై జూలై 20, సోమవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆస్పత్రులు మరియు కరోనాకు చికిత్స అందజేసే ప్రైవేటు ఆస్పత్రులు కూడా నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా మందులను వినియోగించాలని పేర్కొన్నారు. అదే విధంగా అత్యవసర కేసుల్లో మాత్రమే అదనపు డోసులు ఉపయోగించాలని, వాటికీ నిర్ణయించిన ధరను మాత్రమే వసూలుచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
కరోనా చికిత్సలో భాదితులు సైటోకైన్ స్టార్మ్ సిండ్రోం దశలో ఉంటే తోసిలిజుమాంబ్ ఇంజక్షన్ వాడాలని సూచించారు. కరోనా లక్షణాల తీవ్రత ఎక్కువుగా ఉన్న బాధితులకు రెమిడెసివిర్, తక్కువగా ఉన్న వారికీ ఫావిపిరావిర్ టాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పారు. సెప్సిస్ లేదా సెప్టిక్ షాక్ వంటి పరిస్థితుల్లో వారికీ మెరొపెనం ఇంజక్షన్ను ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో సూచించింది. చికిత్స ప్రోటోకాల్ పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu