రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు, అందుకు జారీ చేసిన జీవోలపై ఏపీ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 13, సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఏప్రిల్ 16 కల్లా ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 20 కు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. ఎస్ఈసీగా రమేష్కుమార్ తొలగింపుపై ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, అలాగే మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ముందుగా ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని ఐదు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలకు కుదించడంతో పాటుగా, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించేలా చట్టానికి సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం ముగిసినట్లయింది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన దస్త్రానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో జస్టిస్ కనగ రాజ్ ఏప్రిల్ 11, శనివారం నాడు ఏపీ నూతన ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu