ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన రైతు సభలో పాల్గొన్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచన చేసి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పనిచేసారన్నారు. ఆయన పుట్టినరోజున రైతు దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో రైతు విప్లవానికి వైఎస్ఆర్ నాంది పలికారని చెప్పారు. జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మార్చారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం కూడా రైతుల పక్షపాతంగా పాలన కొనసాగిస్తుందని తెలిపారు.
అలాగే ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య నీళ్ల విషయంలో జరుగుతున్న గొడవలును చూపిస్తున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు, కొందరు తెలంగాణ మంత్రులు కూడా ఈ విషయంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే రాయలసీమ, కోస్తా, తెలంగాణ అని, ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికి తెలుసన్నారు. గత ఒప్పందాలపై సంతకాల ప్రకారం కోస్తాకు 367, రాయలసీమకు 144, తెలంగాణకు 298 టీఎంసీలు కేటాయించారన్నారు. ఇప్పుడు రాయలసీమ పరిస్థితిని ఆలోచించాలని అన్నారు. 881 అడుగుల నీటిమట్టం ఉంటేనే కానీ పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావని, గత 20 ఏళ్లలో శ్రీశైలంలో 881 అడుగులకుపైగా 20 నుంచి 25 రోజులకు మించి కూడా నీళ్లు లేవని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్ట్లకు 800 అడుగులలోపే నీళ్లు తీసుకునే వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి ఉందని, అలాగే 796 అడుగుల వద్దే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారన్నారు. 800 అడుగుల్లోపే నీటిని తెలంగాణ వాడుకున్నప్పుడు, ఏపీ వాడుకుంటే తప్పేంటని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఏ రాష్ట్రంతో మాకు విభేదాలు వద్దు, పాలకుల మధ్య సఖ్యత ఉండాలి:
చంద్రబాబు ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్లు కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా అని ప్రశ్నించారు. నీటి విషయంలో రాజకీయాలకు చేయవద్దని సీఎం జగన్ సూచించారు. ఏ రాష్ట్రంతో మాకు విభేదాలు వద్దు, ప్రతి రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాను. అక్కడ, ఇక్కడ ప్రజలు చల్లగా ఉండాలని, అలా జరగాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలని, అలా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అందుకే, తెలంగాణ రాజకీయాల్లో జగన్ వేలు పెట్టలేదు. కర్నాటక రాజకీయాల్లో వేలు పెట్టలేదు. తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు, ఇక ముందు కూడా వేలుపెట్టను అని చెపుతున్నానని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ