ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత తొలగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికలసంఘం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 16 పిటిషన్లను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున జోక్యం చేసుకోలేమని, ఎస్ఈసీ ఇచ్చిన పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికల నిర్వహించుకోవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ యథావిధిగా జరగనుంది.
ఇటీవలే 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా గత సంవత్సరంలో నిలిచిన ఈ ఎన్నికల ప్రక్రియను మళ్ళీ అక్కడినుంచే కొనసాగించే విధంగా ఎస్ఈసీ ఉత్తర్వులు వెలువరించింది. ముందుగా మార్చి 7, 2020 న మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవగా, ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల పరిశీలన దశ(మార్చి 14,2020) వరకు పూర్తయింది. మార్చి 23, 2020న పోలింగ్ జరగాల్సి ఉండగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితుల వలన మార్చి 15, 2020 న ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల పక్రియ ఏదశలో ఆగిపోయిందో మళ్ళీ అక్కడినుంచే ప్రారంభించేలా ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3, 2021 న నామినేషన్ల ఉపసంహరణ దశ నుంచి ఎన్నికల పక్రియ ప్రారంభం కానుంది. మార్చి 10 న పోలింగ్, మార్చి 14 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ