ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ మూవీ టిక్కెట్ సిస్టమ్పై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జీవో నంబర్ 69ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏపీలో ఇకపై సినిమా టిక్కెట్ల విక్రయాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా, టిక్కెట్లన్నీ ఆన్లైన్ లోనే అమ్మేలా సవరణ చట్టంలో మార్పులు చేస్తూ జగన్ సర్కార్ జీవో నంబర్ 69 తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవస్థను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ)కు అనుసంధానిస్తూ ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సినిమా విక్రయంపై ప్రభుత్వం తెచ్చిన సవరణ నిబంధనలను, దానికి సంబంధించిన జీవోలను కొట్టేయాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ క్రమంలోనే కొంతమంది సినిమా థియేటర్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో నంబర్ 69ను సవాల్ చేస్తూ హై కోర్ట్ లో బుక్ మై షో మరియు మల్టీప్లెక్స్ విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ పిటీషన్లు దాఖలు చేశారు. బుక్ మై షో తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా, మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు రోజుల పాటు వాదనలు విన్న తర్వాత ప్రస్తుతానికి ఈ విధానాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనిపై తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ