శనివారం విశాఖపట్నంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో ‘విశాఖ గర్జన’ ర్యాలీ, భారీ బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ గర్జన ర్యాలీలో పాల్గొనడానికి పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర నేతలు విశాఖకు చేరుకున్నారు. ర్యాలీ మరియు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలపై పలు విమర్శలు చేశారు. అయితే మరోవైపు శనివారం విశాఖపట్నంలో జనసేన కూడా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జనసేన కార్యకర్తలు కూడా భారీగా నగరానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విశాఖ గర్జన కార్యక్రమం అనంతరం వైసీపీ నేతలు తిరుగు పయనమై విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు.
దీంతో అప్పటికే అసహనంతో ఉన్న జనసేన కార్యకర్తలు మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వైసీపీ నేతల అనుచరులు కూడా ప్రతిస్పందించడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అరుపులు, కేకలతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, మంత్రులను అక్కడినుంచి విమానాశ్రయంలోకి తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనలో మంత్రి జోగి రమేష్ తన కారు ధ్వంసం అయిందని, అలాగే తన సహాయకుడి తలకి గాయమైందని తెలిపారు. ఇక ఈ పరిణామంతో వైసీపీ నేతలు జనసేనానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ నేతలపై దాడి చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY