ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విజయవాడ, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, మచిలీపట్నం, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం వంటి 11 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. అలాగే 13 జిల్లాలలోని 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఇప్పటికే 73 చోట్ల సంచలన విజయాలను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో “ఫ్యాన్” హవానే కొనసాగింది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాలు, నగరాల్లోని ప్రజలు జైకొట్టడంతో అధికార వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేసింది. ఏపీ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో తొలిసారిగా ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన పరిపాలనతో ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలలో ఇటువంటి ఫలితాలే వస్తాయని అన్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో కనీస ప్రభావాన్ని కూడా చూపలేకపోయాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ