ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికార వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ణతలు తెలిపారు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల పోరాటం అనేది తెలంగాణకే పరిమితమైనది కాదని, బీసీల హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాడుతున్నానని స్పష్టం చేశారు. గడచిన 47 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశాను. అయినా ఏ రాజకీయ పార్టీ కూడా నన్ను గుర్తించలేదు. కానీ సీఎం జగన్ నా పోరాటాలను గుర్తించి నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మరింత సేవ చేయటానికి తోడ్పడే ఒక బృహత్తర అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు అని చెప్పారు కృష్ణయ్య.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టలేకపోయిందని, సీఎం జగన్ మాత్రం చట్టసభలో 50శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లు ప్రవేశపెట్టించారని ప్రశంసించారు. అలాగే ఏపీలో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారని, బీసీల మీద సీఎం జగన్ చూపుతున్న అభిమానాన్ని ఇప్పటివరకు మరే సీఎం చూపలేదని కొనియాడారు. ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ పది మందికి అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికీ కలిపి మొత్తం మంత్రివర్గంలో 25 మందికి గానూ 15 మందికి చోటు కల్పించారు. సీఎం జగన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. పార్టీ కండువా కప్పుకోపోయినా, తాను వైసీపీలో చేరినట్లేనని, బీసీల కోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందని కృష్ణయ్య స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ