ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇటీవలే రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణకు ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందని, రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య కూడా తగ్గిందన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తునట్టు తెలిపారు. ఈ ఎన్నికలకు న్యాయపరంగా కూడా ఇబ్బందులు లేవని తెలిపారు. మరోవైపు పోలింగ్కు నాలుగు వారాల ముందుగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తేదీలు, ఇతరత్రా వివరాలపై పూర్తి సమాచారం కోసం మరికొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ