విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో బాధితులకు పరిహారం కోసం రూ.30 కోట్లను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 8 న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఈ రోజు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్లు ముందుగా బాధిత కుటుంబాలను పరామర్శించి, మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది బాధిత కుటుంబాలకు ఈ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, గ్యాస్ లీకేజీ వలన ప్రభావితమైన గ్రామాల్లో ప్రస్తుతం పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విధంగా కోటి రూపాయలను బాధిత కుటుంబాలకు అందజేశామన్నారు. ముందుగా ప్రభావిత గ్రామాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టామని, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రజలను వారివారి గ్రామాల్లోకి అనుమతించనున్నట్టు తెలిపారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఒక్కో మంత్రి ఒక్కో గ్రామంలో ఈరోజు రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలని మంత్రి కన్నబాబు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu