ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ గురువారం నాడు అధికారికంగా ప్రకటించారు. ముందుగా జనసేన పార్టీ మద్దతుతో తిరుపతిలో బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధరన్ ఇటీవలే వెల్లడించారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ తిరుపతిలో పోటీచేస్తునట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి రత్నప్రభకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. “తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు శుభాకాంక్షలు. ప్రజా జీవితంలోనే కొనసాగిన వారి యొక్క సుదీర్ఘ పరిపాలనా అనుభవం, ప్రజలకు సేవలందించటానికి ఆమెను అత్యుత్తమమైన అభ్యర్థిగా నిలబెడుతుంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, ఆమెను గెలిపించి, వారి యొక్క విలువైన సేవలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకోవలసినదిగా అభ్యర్థిస్తున్నాను” అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
మరోవైపు తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మీ పోటీ చేస్తున్నారు. తిరుపతి ఉపఎన్నిక కోసం ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 17 వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ