నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పై కేసు నమోదయింది. కోటంరెడ్డి తన అనుచరులతో కలిసి, శుక్రవారం రాత్రి తన ఇంటిపై దౌర్జన్యానికి దిగారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు మేరకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్రెడ్డి పై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంకటాపురం మండల పరిధిలోని అనికేపల్లిలో ఎమ్మెల్యే అనుచరుడైన శ్రీకాంత్ రెడ్డికి చెందిన లేఅవుట్ లో పంచాయతీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అడిగారని, పరిశీలిస్తానని తెలిపిన కూడ తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి బెదిరించారని కోటంరెడ్డిపై సరళ ఫిర్యాదు చేశారు.
కేసు పెట్టేందుకు శుక్రవారం రాత్రి స్టేషన్ కు వెళ్తే ఎవరూ అందుబాటులో లేకుండా పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో సరళ దీక్షకు కూర్చున్నారు. మండల స్థాయి అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. తెల్లవారుజామువరకు ఆమె అలాగే పోరాటం సాగించారు. ఆమె దీక్షకు సంబంధించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జరిగిన ఈ సంఘటనపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్నందుకు ఒక మహిళా అధికారిణిపై వైసిపి ఎమ్మెల్యే ఒకరు దౌర్జన్యం చేశారు. తనకు న్యాయం చేయాలని అర్థరాత్రి వేళ ఆ మహిళాధికారి పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు తీసుకోడానికే జంకారంటే, ఈ రాష్ట్రంలో పోలీసింగ్ ఉన్నట్టా లేనట్టా? అని ప్రశ్నించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
[subscribe]