రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసనలకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు తిరుపతిలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా చంద్రబాబు హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని ర్యాలీలో పాల్గొంటున్నారు. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ ర్యాలీకి ముందుగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అనంతరం షరతులతో కూడిన అనుమతి ఇస్తూ, కృష్ణాపురం ఠానా వరకు ర్యాలీ నిర్వహించుకోవచ్చని చెప్పారు. అయితే జేఏసీ నాయకులు మాత్రం పూలే విగ్రహం నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు ర్యాలీ చేపడతామని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు భారీ స్థాయిలో మోహరించి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ర్యాలీ అనంతరం జరిగే బహిరంగసభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు.
[subscribe]