కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జనవరి 11, శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరుగుతుంది. అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలోనే ఈ సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, చిదంబరం లతో పాటుగా ఇతర సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. జనవరి 13న ఢిల్లీలో ప్రతిపక్షాలతో భేటీ కావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ భేటీ అయినట్టుగా తెలుస్తుంది.
దేశంలో కొన్ని ప్రాంతాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, జేఎన్యూలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన, విద్యార్థుల నిరసనలపై ఈ భేటీలో కీలకంగా చర్చించనున్నారు. సోనియా గాంధీ ఇప్పటికే జేఎన్యూలో విద్యార్థులపై జరిగిన దాడిని ఖండించి, పార్టీ తరపున నిజనిర్ధారణ చేసేందుకు బృందాన్ని పంపిన సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అ అంశంపై కూడా చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
[subscribe]