రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసు వ్యవరించిన తీరును జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. జనవరి 10న రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మహిళలకు, పోలీసులకు వాగ్వాదం చేసుకోవడం, అనంతరం ఇతర పరిణామాలు ఏర్పడడంతో ఆ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి అమరావతికి నిజనిర్ధారణ కమిటీని పంపుతామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఇప్పటికే పోలీసులకు నోటీసులు కూడా పంపింది.
ఈ నేపథ్యంలోనే జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం జనవరి 12, ఆదివారం ఉదయం గుంటూరుకు చేరుకున్నారు. మహిళలు, పోలీసుల నుంచి వివరాలు సేకరించనున్నారు. మరోవైపు పోలీసులు తీరును మహిళా రైతులు కమిటీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఘటన సందర్భంగా కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన కథనాల వీడియోలు, ఫోటోలను కమిషన్ సభ్యులకు అందచేయనున్నారు. రాజధాని కోసం నిరసన తెలుపుతున్న సందర్భంలో ఎదుర్కుంటున్న సమస్యలపై మహిళా రైతులు ఫిర్యాదు చేయనున్నారు.
[subscribe]