టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా చంద్రబాబు పర్యటనలు చేపట్టారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులను పరామర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అటు యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. విజయవంతంగా పాదయాత్రతో లోకేష్ దూసుకెళ్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
ఈక్రమంలో చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు మరింత చేరువవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 20 నుంచి వీలైనన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు.. బాబు ష్యూరిటీ-రాష్ట్రానికి గ్యారెంటీ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టారు. అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబును నంద్యాలలో సీఐడీ అరెస్ట్ చేసింది.
ఆ తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లడంతో.. ఈ కార్యక్రమం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈక్రమంలో ఆ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించి.. వీలైనన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు చంద్రబాబు రెడీ అవుతన్నారు. ఈ మేరకు టీడీపీ నేతలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కార్యక్రమం ముగిసిన నంద్యాల నుంచే పర్యటనలు ప్రారంభిస్తారా.. మరే ఇతర ప్రాంతం నుంచి ప్రారంభిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎంఎల్ఏలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు మరికొంత మంది టీడీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. ఈక్రమంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తమ పార్టీలో చేరారంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయాయని మండిపడ్డారు. రాష్ట్రం బాగుచేయాలనే సంకల్పంతోనే జనసేనతో పొత్తు పెట్టుకున్నామని.. ప్రజలు తమ పొత్తును ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE