అందరి అంచనాలను మించి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నాక తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. అంతవరకూ అధికారం మాదే అని ధీమాగా ఉన్న నేతలంతా ఏ ఆరోపణలతో కటకటాల వెనుకకు వెళ్లాల్సి వస్తుందోనని భయభయంగా గడుపుతున్నారు. మొన్నటికి మొన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజు వ్యవహారంపై కేసు, మేడ్చల్ మాజీ మంత్రి మల్లారెడ్డి భూముల రిజిస్ట్రేషన్లపై కేసులు నమోదు కాగా..రాబోయే రోజుల్లో ఏ బీఆర్ఎస్ నేత పేరు బయటకొస్తుందోనన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది.
దీనికి తోడు ఎన్నికల ముందు రాజకీయం అంతా రేవంత్ రెడ్డి వర్సస్ మల్లారెడ్డి అన్నట్లుగానే జరిగింది. అందుకే రేవంత్ రెడ్డి సీఎం పీఠం ఎక్కగానే మొదటి గురి మల్లారెడ్డిపైనే ఇక ఆయన పని అయిపోయినట్లేనన్న వార్తలు గుప్పుమన్నాయి. దీనికి తగినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనిపించని మల్లారెడ్డి భూముల రిజిస్ట్రేషన్ల విషయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసుల రూపంలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇక హస్తంతో దోస్తీ కట్టకపోతే తన హస్తాలకు బేడీలే అన్న అనుమానం వచ్చిందో ఏమో కానీ మల్లారెడ్డి మాటలు కాంగ్రెస్కు అనుకూలంగా మారిపోయాయి.
అవును..మల్లారెడ్డి అలా మాట్లాడటంతో.. కాంగ్రెస్ గూటికి చేరిపోతారంటూ వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా మల్లారెడ్డి చేసిన కామెంట్లు రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తొడలు కొట్టి సవాళ్లు చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన మల్లారెడ్డి సడన్గా మాట ఎందుకు మార్చారంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రేవంత్ తనకు మంచి స్నేహితుడంటూ చెప్పడం అందరిని షాక్లో పడేసింది.
అంతేకాదు అసెంబ్లీ అయిపోయాక తన అల్లుడితో కలిసి మాజీ మంత్రి సైలెంట్గా బయటకు వచ్చారు. అయితే అదే సమయంలో తీన్మార్ మల్లన్న అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి ఎదురవడంతో ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. ఈ మధ్యనే కాంగ్రెస్లో చేరిన మల్లన్న.. మేడ్చల్ సీటు ఆశించారు కానీ కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్నకి ఆ సీటును కేటాయించలేదు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ ఆ సీటు గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో మల్లన్న మీరు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారా అని అడిగారు.
అసెంబ్లీలో కాంగ్రెస్కు సీట్లు తక్కువగా ఉంటే కచ్చితంగా మద్దతు కాంగ్రెస్కే ఇస్తానంటూ మల్లారెడ్డి చెప్పారు. దీనితో ఊరుకోకుండా ఎన్నికల సమయంలోనే పార్టీలు, రాజకీయాలు ఉంటాయి. ఎన్నికలు అయిపోయాక ఇలాంటి రాజకీయాలు ఉండవని మల్లారెడ్డి మాట్లాడడం మరింత షాక్ కలిగించాయి. సొంత పార్టీక కాకుండా అధికారంలో ఉన్న అధికార పార్టీకి మద్దతిస్తానని మాట్లాడంతో మల్లారెడ్డి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
దీంతో మల్లా రెడ్డి మాటల వెనుక మర్మం గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరి చిట్టాలు బయటపెడుతూ వస్తున్నారు. అలా మల్లారెడ్డి 47 ఎకరాలు భూ కబ్జా చేశారని ఒక ఆరోపణ వినిపించడం.. అది కేసు వరకూ వెళ్లడంతో రాజకీయాల్లో రాజీ లెక్కలు బాగా వేస్తారన్న పేరున్న మల్లారెడ్డి ఇప్పుడు మళ్లీ అదే బాట పడుతున్నారని.. అందుకే కాంగ్రెస్ రాగం అందుకున్న ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్లడానికి మల్లారెడ్డి రెడీ అవుతున్నారని.. వెంట తన అల్లుడిని కూడా తీసుకువెళ్తారనే వార్తలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. తనపై భవిష్యత్తులో ఎలాంటి కేసులు నమోదవకుండా ఉండటంతో పాటు..ఇప్పుడు ఇరుక్కున్న కేసుల నుంచి బయటపడటానికి హస్తానికి చేయి అందించి సరెండ్ అవడమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంత వరకూ నిజం ఉందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE