ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి పెన్షన్ పెంపుని ఆమోదిస్తూ కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై శుక్రవారం వర్క్షాప్ నిర్వహించిన సందర్భంగా పార్టీ నేతలకు ఆదేశించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు. కాగా సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు ఈ ఏడాది మే 11న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇక సమీక్షలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి పెన్షన్ పెంపుపై వివరించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అలాగే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి తెలియజేయాలని సూచించారు. అలాగే పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని, అయితే కొందరు నేతలు ఈ విషయంలో ఆసక్తి చూపించడం లేదని తన దృష్టికి వచ్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారని, వీరు తమ పనితీరుని మెరుగు పరుచుకోవాలని హెచ్చరించారు. తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. మొత్తం 32 మంది నేతల పనితీరు బాగోలేదని, పార్టీ కోసం వారు తక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మార్చిలో మళ్ళీ సమీక్ష నిర్వహిస్తానని, ఈలోపు వీరందరూ పనితీరులో పురోగతి చూపించాలని సీఎం జగన్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ