తెలంగాణలోని తాండూరు నియోజకవర్గం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షాక్ తగిలింది. మూడేళ్ల క్రితం బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19న ఆయన విచారణ నిమిత్తం ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. గతంలో డ్రగ్స్ కేసులో బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖుడిని గోవిందపుర పోలీసులు అరెస్ట్ చేయగా, డ్రగ్స్ సరఫరా చేసిన పార్టీకి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా హాజరయ్యాడని ఈడీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా మూడేళ్ల క్రితం బెంగళూరులో నిర్మాత శంకరగౌడ తన స్నేహితుల కోసం బెంగళూరులో పార్టీ ఏర్పాటు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ పార్టీకి పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలను శంకరగౌడ ఆహ్వానించారు. ఈ క్రమంలో శంకరగౌడ ఆహ్వానం మేరకు బెంగుళూరుకి చెందిన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలహర్ రెడ్డి, సందీప్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారని సమాచారం. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇక తనకు ఈడీ అధికారుల నుంచి నోటీసు అందిందని, వారు కోరినట్లు డిసెంబర్ 19న ఈడీ ఎదుట హాజరవుతానని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ కుటుంబ సభ్యుల ఆర్ధిక లావాదేవీలు, వ్యాపారాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ఈడీ అధికారులు కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఏ కేసుకి సంబంధించి ఈ నోటీసులు జారీ చేశారో ఈడీ అధికారులు స్ఫష్టత ఇవ్వలేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెల్లడించారు. ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం రోహిత్ రెడ్డి వాంగ్మూలాన్ని స్థానిక కోర్టు నమోదు చేసింది. మరోవైపు ఇదే కేసుకి సంబంధించి ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్కు కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఆమెను కూడా డిసెంబర్ 19న ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ