ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించనున్నారు. అలాగే అదేరోజున సీతారామ కల్యాణం నిర్వహించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 10న ప్రారంభమయ్యే ఆలయ వార్షిక బ్రహ్మోత్సవంతో పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో.. బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. కల్యాణానికి తరలివచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వసతి, పారిశుద్ధ్యం, పార్కింగ్ స్థలాలు తదితర ఏర్పాట్లు చేయాలని TTD ఆలయ అధికారులను కోరింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గడచిన రెండేళ్లుగా సరిగా నిర్వహించలేదు.
అందుకే దీనిని గ్రాండ్గా చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అందునా ఇది అధికారిక కార్యక్రమం అయినందున, జిల్లా యంత్రాంగం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో వైభవంగా జరిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రెండు లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రసాదాల తయారీ కోసం తిరుపతిలో ఉన్న టీటీడీ సరకుల నిల్వ కేంద్రం నుంచి అవసరమైన దినుసులను తీసుకురానున్నారు. వీవీపీఐ, వీఐపీ, సామాన్య భక్తులు ప్రాంగణంలోకి రావడానికి వేర్వేరుగా క్యూలైన్లు నిర్మిస్తున్నారు. మాడ వీధులు, ఉద్యాన వనాలు, పుష్కరిణి, కల్యాణ వేదిక ప్రాంగణంలో విద్యుద్దీపాలను ఏర్పాటు చేయిస్తున్నారు.
ఏప్రిల్ 10 నుంచి 18 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా.. కడప కలెక్టర్ వి.విజయరామరాజు, టిటిడి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.వీరబ్రహ్మం వొంటిమిట్టలోని ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను సంయుక్తంగా తనిఖీ చేశారు. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు సహా ప్రముఖులు వచ్చే ‘కళ్యాణ వేదిక’లో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని శ్రీ రాజు తెలిపారు. వసతి, భద్రత, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదం, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ సూచిక బోర్డులు, కంట్రోల్ రూమ్, సీసీటీవీ నెట్వర్క్, విద్యుత్ అలంకరణ, అగ్నిమాపక సేవలు, హెల్ప్ డెస్క్ తదితర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ