ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ విధానం అందరి అభినందనలు అందుకోవడంతో పాటుగా వ్యాక్సినేషన్ సజావుగా సాగుతుందని తెలిపారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకోలేని కరోనా వ్యాక్సిన్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని ప్రధాని మోదీకి ఈ లేఖ ద్వారా సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
“జూన్ 20న ఒక్కరోజే 13,72,481 మందికి, ఏప్రిల్ 14న 6,32,780 మందికి, మే 27న 5,79,161 మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం మా రాష్ట్రానికి ఉందని చాటిచెప్పాం. రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు అందిస్తే ఇలాంటి భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు కొనసాగిస్తాం. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలుండగా, ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వాలంటీర్లు, 40 వేల మంది ఆశా వర్కర్లు, 19 వేలకుపైగా ఏఎన్ఎంలు, భారీ సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలున్నాయి” అని తెలిపారు.
“మే 1 నుంచి అమలు చేస్తున్న సరళీకృత జాతీయ కోవిడ్-19 వ్యాక్సినేషన్ విధానం ప్రకారం దేశంలో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేట్, పారిశ్రామిక సంస్థలకు (ఆసుపత్రులు ద్వారా) సేకరించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే జూన్ 21 నుంచి అమలోకి వచ్చిన సవరించిన జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ విధానంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు 25 శాతం వ్యాక్సిన్లు సరఫరా చేసే అంశాన్ని కొనసాగిస్తున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 2,67,075 మందికి మాత్రమే వ్యాక్సిన్స్ వేయగలిగారు. రాష్ట్రంలోని జూలై నెలకు సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులకు 17,71,580 వ్యాక్సిన్ డోసులు కేటాయించారు. గత అనుభవాన్ని గానీ, ప్రైవేట్ ఆసుపత్రులలో వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్ గానీ పరిశీలిస్తే అంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులు సద్వినియోగం చేసుకోలేవనే విషయం స్పష్టమవుతోంది. జూన్ 24న కేబినెట్ సెక్రెటరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కొంతమంది ఇతర రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అందువలన ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకోలేని వ్యాక్సిన్ నిల్వలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కు కేటాయించేందుకు అనుమతించాలని కోరుతున్నాను. దీనివలన వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతమవడమే కాకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు దోహదపడనుంది. ఈ విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను” అని సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ