ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వ్యవసాయ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతులు వ్యవసాయం చేస్తున్నారని, వారికి మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ అధికారులతో పేర్కొన్నారు. అందుకే వారిపై అదనపు భారం పడకుండా రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలకు అనుగుణంగా ఈ కొత్త విధానం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా తొలుత శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్ ప్రాజెక్టు చేపట్టామని, ఇది విజయవంతం అయ్యిందని తెలియజేశారు. ఈ విధానం వలన దాదాపు 30శాతం విద్యుత్ ఆదా అయ్యిందని, కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగంలో పారదర్శక వ్యవస్థ ఏర్పడిందని, రైతులకు పూర్తిగా నాణ్యమైన కరెంటు లభిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అవడంతో ఇకపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చాలని ఆదేశించారు.
అయితే దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది కేవలం రాజకీయంగా లబ్ధికోసం మీటర్ల వ్యవహారంపై ప్రజలను, రైతులని తప్పు దారి పట్టిస్తున్నారని, ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి రైతులకు జరుగుతున్న మేలును వివరించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేవు. విద్యుత్ పంపిణీ సంస్థలు-డిస్కమ్లు-ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నాయి. ఈ విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం పెద్దమొత్తంలో సబ్సిడీ చెల్లిస్తోంది. ఫలితంగా వ్యవసాయ రంగానికి వాస్తవంగా ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారనే దానిపై స్పష్టత లేదు. అందుకే ఇకపై దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయానికొచ్చినట్లు సమావేశంలో వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ