పట్టుదలతో శ్రమించి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని హరిహరకళాభవన్ లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కోచింగ్ కోసం భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకిటించిన విషయాన్ని గుర్తు చేశారు. అందులో భాగంగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి, 16 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని చెప్పారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ అధికారులు కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింతగా శ్రమించి మీ కలను నిజం చేసుకోవాలని ఆకాక్షించారు.
ప్రభుత్వ ఉద్యోగి అంటే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపిక అయితే మీతో పాటు మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులకు కూడా గౌరవం లభిస్తుందని మంత్రి తలసాని అన్నారు. గతంలో కొద్దో గొప్పో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగేదని, అందులో కూడా పలుకుబడి కలిగిన వారికే లభించేవని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఎక్సైజ్ తదితర శాఖలలో 80 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించేందుకు అన్నపూర్ణ భోజన కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. శిక్షణ కోసం వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడే పరిస్థితి ని దృష్టిలో ఉంచుకొని ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పలు చెప్పి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుందని మంత్రి విమర్శించారు. పోలీసు శాఖను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొనేందుకు వాహనాలను అందజేసిందని, పోలీసు స్టేషన్ భవనాలను ఎంతో ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్, నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి, ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు నరేష్ రెడ్డి, రమేష్, సుధీర్, రవి శంకర్, శ్యామ్ ఇనిస్టిట్యూట్ సిబ్బంది శివశంకర్ రెడ్డి, శేఖర్, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ