ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడుతున్నారు. రెండోరోజు (జూలై 27, బుధవారం) పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు(ఏఎస్ఆర్), ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ముందుగా బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి ఏఎస్ఆర్ జిల్లా చింతూరుకు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. చింతూరు మండలంలోని కుయుగూరు గ్రామంలో వరద బాధితులతో సీఎం సమావేశమై, వారికీ అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరగదని, అందరికి పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. ఇళ్లు, పంటలకు జరిగిన విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదన్నారు. చింతూరు సహా నాలుగు మండలాల్లో బాధితులను ఆదుకునేందుకు 20 రోజుల పాటు గ్రామాల్లోనే కలెక్టర్ నివాసం ఉండడం ఎప్పడూ, ఎక్కడా చూడలేదని, ఈ రోజు వ్యవస్థలో వచ్చిన మార్పును గమనించమని ప్రజలను సీఎం కోరారు.
మరోవైపు పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం మొత్తం రూ.20 వేల కోట్లు అవసరమని, ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతూనే ఉన్నామన్నారు. 1000 కోట్లు లేదా 2000 కోట్లు అయితే ప్రభుత్వమే ఇచ్చేదని, పెద్దమొత్తం కాబట్టి కేంద్రం సాయం చేయాల్సిందేనని అన్నారు. పోలవరం పునరావాసం అంశమంతా కేంద్రం చేతుల్లో ఉందని, ఆ సాయం కోసం వీలైనంత ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కేంద్రం పరిహారం ఇవ్వకుంటే రాష్ట్రం నుంచైనా పరిహారం ఇస్తామన్నారు. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయమని నిర్వాసితులకు సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఇక మధ్యాహ్నం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామానికి సీఎం చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలించనున్నారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సీఎం వైఎస్ జగన్ సమావేశమవుతారు. అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగుప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY