ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బుధవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవిని ఏపీపీసీసీ డెలిగేట్గా గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు జారీ చేసింది. ఈ కార్డులో ఆయనను 2027 వరకు పీసీసీ డెలిగేట్గా ప్రస్తావించింది. కాంగ్రెస్ సభ్యుడైనప్పటికీ చిరంజీవి గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2009లో ప్రజారాజ్యం స్థాపించి, తదనంతర పరిణామాల్లో దానిని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం, తద్వారా కేంద్ర మంత్రి పదవి చేపట్టడం తెలిసిందే. ఇక పదవీకాలం పూర్తయ్యాక మళ్ళీ చిరంజీవి ఎక్కడా కాంగ్రెస్ కార్యక్రమాలలో పాల్గొనలేదు. అలాగే సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ అప్పటినుంచి రాజకీయాలలో కానీ, మరే ఇతర రాజకీయ పార్టీతో కానీ క్రియాశీలకంగా ఉండటం లేదు.
ఇక తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నా కూడా మెగాస్టార్ మాత్రం ఎప్పుడూ ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనలేదు. అలాంటిది ఇప్పుడు మరో ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా చిరంజీవికి ఇలా ఐడీ కార్డు జారీ చేయడం విశేషం. దేశవ్యాప్తంగా దాదాపు 9వేల మంది డెలిగేట్లు ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. దీంతో చిరంజీవికి కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించినట్లైంది. అయితే ఇటీవలే చిరంజీవి తాజాగా రాజకీయాలపై తన అభిప్రాయాన్ని మరోసారి తెలియజేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా.. రాజకీయాలు మాత్రం తన నుంచి దూరం కావడం లేదని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు ఒక్కోరకంగా కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తాజా చర్యపై చిరంజీవి స్పందన ఏంటనేది తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY