ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 24, శుక్రవారం నాడు క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కరోనా చికిత్సపై రాబోయే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. చికిత్సలో భాగంగా మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కరోనా పరీక్షలు, క్వారంటైన్ సదుపాయాల నిమిత్తం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు.
అలాగే కరోనా బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలో అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. మరో 2380 క్రిటికల్ కేర్ బెడ్లు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 138 ఆస్పత్రులు కరోనా చికిత్స కోసం క్రిటికల్ కేర్ సదుపాయాలు కలిగి ఉన్నాయన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర స్థాయిలో మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ సదుపాయలు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో 3 ఆస్పత్రులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu