ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం పూజ కార్యక్రమాలు అనంతరం 9 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, దర్శనానికి వచ్చే భక్తులంతా మాస్క్ సహా ఇతర అన్ని కోవిడ్ నిబంధనలు పాటించాలని దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు కోరారు.
మరోవైపు దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మూల నక్షత్రం రోజున(అక్టోబర్ 21) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారని ఆలయ ఈవో పేర్కొన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మరియు సాయంత్రం 3 నుంచి 5 గంటలు వరకే అనుమతి ఇస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఇక ఆన్లైన్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునేందుకు భక్తులకు ముందుగానే అవకాశం కల్పించారు. ప్రతి రోజు 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. ముందుగా బుక్ చేసుకున్న టైం స్లాట్ ప్రకారమే భక్తులు దర్శనానికి రావాల్సిందిగా సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu