హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు వలన వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వరుసగా నాలుగో రోజు కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పర్యటిస్తున్నారు. నగర శివారులోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని అలీనగర్, గగన్పహాడ్ లలో పర్యటించి, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఏక్స్ గ్రేషియాను మంత్రి కేటిఆర్ అందజేశారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటిఆర్ తెలిపారు. వరదల వల్ల ప్రాణ నష్టం జరగడం బాధాకరమని అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాలనీల్లో వరద నీరు తగ్గుతున్నాయని, వెంటనే పారిశుద్ధ్య పనులు, వైద్య సహాయం కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
భారీ వరదల వలన గగన్పహాడ్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు అవగా, అలీనగర్లో 8 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇప్పటికి 8 మంది మృతదేహాలు లభ్యమవగా, ఇతరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నగరంలోని రాజేంద్రనగర్ లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు తెగిన అప్ప చెరువును మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. సాగునీటి శాఖతో సమన్వయం చేసుకొని తెగిన చెరువు కట్టకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను మంత్రి కేటిఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu