ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులు తనకు సెక్షన్ 160 సీఆర్పీసీ కింద నోటీస్లు ఇచ్చారని, దీని ప్రకారం అరెస్ట్ చేయడానికి వీల్లేదని కోర్టుకు తెలిపారు. అలాగే తన విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్కు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనితో పాటుగా తన న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని, దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని కూడా ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా ఈ కేసులో తొలినుంచి దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా సీబీఐ విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని, అంతేకాకుండా విచారణలో తాను చెప్పిన విషయాలను కూడా ఆ అధికారి మార్చేస్తున్నారని, అధికారి తీరు పక్షపాతంగా ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE