విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కరోనా చికిత్సలో భాగంగా రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తునట్టుగా తెలుస్తుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ లో 30 మందికి పైగా కోవిడ్ బాధితులు, 10 ఆసుపత్రి సిబ్బంది సహా దాదాపు 50 మంది ఉన్నట్లు సమాచారం. కాగా ఈ దుర్ఘటనలో ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలంలో ఏడుగురు చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. మరికొందరు బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కోవిడ్ బాదితులను ఇతర కోవిడ్ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో బాధితులు కిటికీల దగ్గరకు వచ్చి కేకలు వేశారు. ఊహించని ఘటనతో భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. ఆరు ఫైర్ ఇంజిన్లను ఉపయోగించి తీవ్ర స్థాయిలో వస్తున్న మంటలను అదుపులోకి తెచ్చారు. కిటికీ అద్దాలు పగల గొట్టి పోలీసులతో కలిసి నిచ్చెన ద్వారా పలువురిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని అదుపులోకి తీసుకుని, పూర్తిస్థాయి సహాయక చర్యలు చేపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu