రాష్ట్రంలో రైతులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. మెట్టభూములకు సాగునీరు అందించడంలో భాగంగా ఉచిత బోర్లు తవ్వించే “వైఎస్ఆర్ జలకళ” పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28 న ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఉచితంగా బోర్లు తవ్వించడంతో పాటుగా పంపుసెట్లు, మోటార్లు, విద్యుత్ కనెక్షన్ను కూడా ఉచితంగానే అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
జలకళ పథకం ప్రారంబోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగానే మోటార్లు, పంపుసెట్లు, ఇతర సంబంధిత పరికరాలను అందించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోర్లలోతు, భూమి రకం, పంట సాగు వంటి అంశాల ఆధారంగా పంపుసెట్లు, మోటార్ల సామర్ధ్యాన్ని నిర్ణయించి అమర్చనున్నట్టు తెలిపారు. విద్యుత్ కనెక్షన్ తో పాటుగా హెచ్డీపీఈ పైపులు, విద్యుత్ వైర్లు, ఇతర పరికరాలు కూడా రైతులకు ఉచితంగానే సరఫరా చేయనున్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు రూ.2,340 కోట్లు వ్యయంతో రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉచిత బోర్లు తవ్వించే వైఎస్ఆర్ జలకళ ద్వారా 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు సాగునీరు అందించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu