ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నవంబర్ 18, సోమవారం నాడు గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీకి రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కలిసి నడుస్తానని, త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, వంశీపై పోటీ చేసి ఓడిపోయారు. త్వరలో వంశీ వైసీపీలోకి చేరుతారని భావిస్తున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం, కృష్ణాజిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి వెంకట్రావు సీఎం జగన్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పరిస్థితులు, తన రాజకీయ భవిష్యత్తుపై సీఎం జగన్ తో వెంకట్రావు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు స్పందిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్టుగా నడుచుకుంటానని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
[subscribe]