ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు ఎం. మోహన్ బాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. మంగళవారం ఆయన తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు దాదాపు గంటలపాటు ప్రత్యేకంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది. టీడీపీకి దూరమైన మోహన్ బాబు చాలా రోజుల తర్వాత చంద్రబాబును కలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే టీడీపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద నిధులు విడుదల విషయంలో చంద్రబాబు నాయుడుపై ఆయన విమర్శలు చేయడం తెలిసిందే. కాగా మోహన్ బాబు గతంలో టీడీపీకి సన్నిహితంగా ఉండేవారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా దాదాపు ఒక దశాబ్దం పాటు టీడీపీకి దూరమైన ఆయన గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిన అనంతరం మోహన్ బాబుకు, వైసీపీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడినట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం సినీ పరిశ్రమ పెద్దలను సీఎం జగన్ కలిసినప్పుడు కూడా మోహన్ బాబు ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ కావడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే వీరి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తిరుపతిలో మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ స్కూల్ నిర్వహించడం తెలిసిందే. కాగా ఇక్కడ కొత్తగా షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించిన క్రమంలో బాబా వారి విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారని, దీనికి ఆహ్వానం పలికేందుకే మోహన్ బాబు టీడీపీ అధినేతని కలిశారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మంచు ఫ్యామిలీ టీడీపీ అధినేతను ఆయన నివాసంలో కలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ