భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మూసీ నదికి వరద పోటెత్తి ఉగ్రరూపం దాల్చింది. నగరంలోని జియాగూడ వద్ద మూసీ పొంగి పొర్లుతుండంతో చాదర్ఘాట్ లోలెవల్ బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తుంది. అలాగే మూసారాంబాగ్ చాందిని బ్రిడ్జి పైనుంచి కూడా భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జిలను రెండువైపులా అధికారులు బారీకేడ్లతో మూసివేసి, రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ రెండు బ్రిడ్జిలను మూసివేయడంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో వాహనదారులకు ఇబ్బంది నెలకుంది.
ముందుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో నగరంలోని శివారు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లోకి భారీగా వరద రావడంతో అధికారులు గేట్లను ఎత్తివేశారు. ఈ క్రమంలో మూసీ నదిలోకి వరద పోటెత్తడంతో కొన్ని బస్తీలు, కాలనీలలోకి వరద నీరు చేరింది. కాగా పరిస్థితుల దృష్ట్యా నగరంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు ముందుగానే హై అలర్ట్ ను ప్రకటించారు. మంగళవారం రాత్రే మూసారాంబాగ్ బిడ్జిపై మూసీ నది పొంగిపొర్లుతున్న కారణంగా బ్రిడ్జిను తాత్కాలికంగా మూసివేసి, ఇరువైపులా ట్రాఫిక్ను మళ్లించామని, దయచేసి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు మూసీ ప్రాజెక్టుకు వరద పెరుగుతుండడంతో, నాలుగు అడుగుల మేర ఎనిమిది గేట్లును ఎత్తి అధికారులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY