తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక చేసింది. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ తాజా ప్రకటన చేయడం విశేషం. ఒకవైపు తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనిప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
ఇక మరోవైపు ఆంధ్రాలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా గడచిన రెండు రోజులుగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిక్కుగా కొనసాగుతోంది. అలాగే ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి విస్తరించాయి. అలాగే రాజస్థాన్ నుంచి మధ్య భారతం, ఉత్తర కోస్తాలో కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవనద్రోణి కొనసాగుతోంది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున రానున్న రెండు రోజులూ కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ