ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కీలక మలుపులు తిరిగి ఈ కేసు.. తాజాగా మరో కొత్త మలుపు తిరిగింది. వివేకా మర్డర్ కేసుకు సంబంధించి కొత్తగా మరో ముగ్గురిపై కేసు నమోదయింది. ఈ కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్న వైఎస్ వివేకా కూతురు సునీతపైనే కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, గతంలో వివేకా కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
వైఎస్ వివేకా పీఏ కృష్ణా రెడ్డి గతంలోనే వారిపై పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య కేసుకు సంబంధించి కొందరు నేతల పేర్లు చెప్పాలని.. హత్యలో పులివెందులకు చెందిన కొందరు నేతల ప్రమేయం ఉందని సాక్ష్యం చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనపై ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు.
అటు వివేకా కూతురు, అల్లుడు.. సునీతా, రాజశేఖర్ రెడ్డి కూడా సీబీఐకి అనుకూలంగా సాక్ష్యంగా చెప్పాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఫిర్యాదులు వెల్లడించారు. తనకు ప్రాణహానీ ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేదన్నారు. అందుకే కోర్టును ఆశ్రయించానని ఫిర్యాదులో కృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్పై పులివెందుల కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ఎస్పీ రాంసింగ్, సునీతా, రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు ఎస్పీ రాంసింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 156(3) కింద కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ముందు ముందు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY