సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్న సమయంలో ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ నిబంధనల మేరకు ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో తన సస్పెన్షన్ పై ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. తనపై విధించిన సస్పెన్షన్, ఆంక్షలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే గత మే నెల నుంచి తనకు వేతనం చెల్లించడం లేదని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేయాలని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ లో పేర్కోన్నారు. 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా కాలం వరకు పోస్టింగ్ దక్కలేదు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఇటీవలే ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
[subscribe]