ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 13, గురువారం నాడు వైఎస్ఆర్ కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రాంత అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కడప ఎంపీ అవినాష్రెడ్డి, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైద్య సంస్థలు, విద్యా సంస్థలు, ఇరిగేషన్ పనులతో పాటుగా నియోజకవర్గంలో వివిధ శాఖలు చేపడుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పులివెందులలో మెడికల్ కాలేజీ, క్యాన్సర్ ఆస్పత్రి పనులు, ఇటీవల శంకుస్థాపన చేసిన పలు రకాల పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయి, నిధుల ఖర్చు, తదితర అంశాలను సీఎంకు అధికారులు వివరించారు.
పులివెందులలో ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడి బోధన అందించే ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు దృష్టిసారించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. అలాగే టౌన్ హాల్ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. కడప జిల్లాలో గ్రామాలవారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్స్టోరేజీలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై మ్యాపింగ్ తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈసారి వర్షాకాల సమయంలో వరద నీరు వచ్చినప్పుడు చిత్రావతి, గండికోట రిజర్వాయర్లను పూర్తిగా నింపేందుకు ముందస్తుగానే అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పారు.
ముద్దనూరు నుంచి కొడికొండ చెక్పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఖర్జూర పెంపకంపై కొందరు రైతులు ఆసక్తి చూపెడుతున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, ఖర్జూర పెంపకానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయించాలని చెప్పారు. నియోజక వర్గంలో వెటర్నరీ, హార్టికల్చర్ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు వారం రోజుల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేయాలనీ సీఎం వైఎస్ జగన్ అధికారులను కోరారు.
[subscribe]