తెలుగు దేశం పార్టీ కంచుకోట శ్రీకాకుళం. గత ఎన్నికల్లో మాత్రం అక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ జిల్లాల్లో మొత్తం 10 స్థానాలు ఉండగా.. అందులో 8 స్థానాల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. కంచుకోటలో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ రెండింటిలో ఒకటి ఇచ్చాపురం నియోజకవర్గం. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి టీడీపీ తరుపున గెలుపొందిన బెందాళం అశోక్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్పై 7 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా అశోక్ వైసీపీ అభ్యర్థిని ఓడించారు.
ఈక్రమంలో ఈసారి ఎలాగైనా ఇచ్చాపురం నియోజకవర్గంలో గెలుపొందాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఆ నియోజకవర్గంపై మరింత ఫోకస్ పెట్టి.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. 2014లో బెందాళం అశోక్కు 25 వేలకుపైగా మెజార్టీ వస్తే.. గత ఎన్నికల్లో 7 వేల పైచిలుకు మెజార్టీ మాత్రమే వచ్చింది. అటు ఇప్పటికే ఆయన రెండుసార్లు గెలుపొందడంతో యాంటీఇంకెంబెన్సీ కూడా ఉంది. ఈక్రమంలో ఈసారి కచ్చితంగా ఆ స్థానంలో గెలువచ్చనే ధీమాతో ఉంది వైసీపీ. ఈక్రమంలో ఆ స్థానం నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది.
గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిన.. పిరియా సాయిరాజ్ భార్యకు ఈసారి టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోపాటు.. గత ఎన్నికల్లో ఆమె భర్త ఓడడంతో సానుభూతితో అయినా ఓట్లు పడుతాయని అనుకుంటున్నారట. అలాగే ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన నర్తు రామారావును జగన్ ఎమ్మెల్సీని చేశారు. ఈక్రమంలో యాదవ సామాజిక వర్గం కూడా ఈసారి తమకు అండగా ఉంటుందని భావిస్తున్నారట.
ఇప్పటికే ఆ నియోజకవర్గ నేతలతో జగన్ మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితోలైనా ఇచ్చాపురాన్ని దక్కించుకునేలా నేతలకు దిశానిర్దేశం చేశారట. టీడీపీ కంచుకోట అయిన ఇచ్చాపురంలో ఈసారి గెలిస్తేనే తమకు అసలైన విజయం దక్కినట్లు అని జగన్ పార్టీ నేతలతో అన్నారట. ఈక్రమంలో నియోజకవర్గంలో కూడా వైసీపీ నేతలు స్పీడ్ పెంచేశారట. మరి టీడీపీ కంచుకోటకు బీటలువారుతాయా?.. వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా?.. అనేది చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE