ఎప్పుడయితే పిఠాపురంలో తాను ఎమ్మెల్యేగా నిలబడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారో.. అప్పుడే పిఠాపురం నియోజకవర్గం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే…అధికార వైసీపీ అలర్ట్ అయి వంగా గీతను వైసీపీ రంగంలోకి దింపింది. నిజానికి పవన్ కు ఈసారి గెలుపు చాలా కీలకం. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన పవన్ ఈసారి వ్యూహాత్మకంగా కాపు సామాజికవర్గానికి పట్టున్న పిఠాపురం నియోజకవర్గానికి మారారు. అయితే అధికార వైసీపీ పవన్ను ఎలా ఓడించాలనే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జ్ మాకినీడి శేషకుమారిని ఇప్పటికే వైసీపీలో చేర్చుకున్న సీఎం జగన్.. మంత్రులను కూడా రంగంలోకి దించుతున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడితో పాటు కాపు సీనియర్ నేతలైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబుతో పిఠాపురంలో విస్తృత ప్రచారం చేయించడానికి నిర్ణయం తీసకున్నారు. వార్డుల వారీగా వీరికి బాధ్యతలను అప్పగించ బోతున్నారు. అంతేకాకుండా పిఠాపురం టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ నేత వర్మ చేస్తున్న కామెంట్లను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ నేతలు రెడీ అయ్యారు.దీంతో పాటు సీఎం జగన్ బస్సు యాత్రను కూడా పిఠాపురంలో నిర్వహించనున్నారు.
మరోవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ తాజాగా ప్రకటించారు. అక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాల దశ, దిశ మారుస్తానని చెప్పుకొచ్చారు. వైసీపీ తనను ఓడించడానికి వైసీపీ ఓటుకు లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైందని పవన్ ఆరోపించారు. దీంతో పవన్ దూకుడుకు చెక్ పెట్టడానికి పిఠాపురంలో టీడీపీ, జనసేన అసంతృప్తులను జగన్ చేరదీస్తున్నారు.
కాపు సామాజిక వర్గం నేతలతోనే ఈ ఎన్నికలలో ప్రచారం చేయించి, వారిని తమ వైపు తిప్పుకోవాలని జగన్ చూస్తున్నారు. వైసీపీ నుంచి ఇప్పుడు బరిలో దిగుతున్న వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందనవారే కావడంతో తను గట్టి పోటీ ఇస్తారని అంతా భావిస్తున్నారు. పిఠాపురం టికెట్ ఆశించిన టీడీపీ నేత వర్మ…అసంతృప్తిలో ఉన్నారు. ఒకవేళ పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తానంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో వర్మ …జనసేనకు ఎంత వరకూ సాయపడతారో తెలియాల్సి ఉంది. ప్రజారాజ్యం సమయంలో వంగా గీత పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆమె వైసీపీలో చేరారు. ఈసారి ఆమె పవన్ పై పోటీ చేస్తుండడంతో ఆసక్తికరంగా మారింది. మొత్తంగా 2024 ఎన్నికల్లో హాట్ సీటుగా పిఠాపురం నిలుస్తుందని అంతా అంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE