ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ-జనసేన-కూటమి కలిసికట్టుగా అధికార పార్టీని ఎదుర్కొంటుండగా, కొన్నిచోట్ల సీట్ల పంచాయితీ ఇంకా తెగడం లేదు. ప్రధానంగా ఈ విషయంలో టీడీపీ-బీజేపీ మధ్య అంతర్గత వార్ జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు ఇచ్చినప్పటికీ.., ఆయా నియోజకవర్గాల కేటాయింపుపై పార్టీ రాష్ట్ర నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకూ అభ్యర్థులను ప్రకటించకుండా, వేచి చూసే ధోరణిలో బీజేపీ ఉంది. టీడీపీ గెలవని సీట్లను బీజేపీకి కేటాయించారని బీజేపీ సీనియర్లు అధిష్టానానికి ఇప్పటికే లేఖ రాశారు. ఈ క్రమంలో పార్టీ చీఫ్ పురంధేశ్వరికి ఢిల్లీ హైకమాండ్ తో మాట్లాడారు.
పొత్తుల్లో భాగంగా బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనీతో పాటు మరికొన్ని సీట్లపైనా బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించడంతో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సీట్లలో మార్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీట్లు ప్రకటించినా మార్పులు తప్పవంటున్నారు బీజేపీ నేతలు. ఈ నెల 21లోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నా.. ఇంకా వెలువరించలేదు.
అభ్యర్థులను ప్రకటించే సమయంలో కూటమిలో ముసలం మొదలైంది. ఓడిపోయే సీట్లన్నీ బీజేపీకి కేటాయించారని టీడీపీపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఓపక్క రాష్ట్రంలో బీజేపీ సభలకు ఏర్పాట్లు చేస్తూనే.. మరోపక్క ఎన్డీఏకు విజయ అవకాశాలు ఉన్న సీట్లను పొందేందుకు రాష్ట్ర నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. వాస్తవానికి ఏపీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ఈ నెల 21న ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, జనసేన మద్ధతుతో కమలం గుర్తుపై పోటీలో నిలిచే అభ్యర్థుల వడపోత కూడా జరిగింది. రాయల సీమలో 4, కోస్తాలో 3, ఉత్తరాంధ్రలో 3 అసెంబ్లీ స్థానాలకు పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
బీజేపీ ఆశించిన సీట్లు పొత్తులో భాగంగా కొన్ని చోట్ల దక్కలేదు. మరికొన్ని చోట్ల బలం లేకున్నా బరిలో దిగాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యల్ని ఎలా అధిగమించాలనే విషయంపై చర్చించేందుకు పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇతర ముఖ్యనేతలు ఢిల్లీకి వెళ్లారు. కొన్ని సీట్లను మార్చే అవకాశాలను పరిశీలించాలని కోరారు. బీజేపీ అగ్రనేతలు జోక్యం చేసుకుంటారా.. లేదా పార్లమెంట్ స్థానాలే కీలకమని అసెంబ్లీ స్థానలను లైట్ తీసుకోమని పేర్కొంటారా.. వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE