ఫిబ్రవరి 2న రాజధాని అమరావతి రైతులకు భరోసా ఇస్తూ విజయవాడలో భారీ కవాతు నిర్వహించాలని జనసేన, బీజేపీ పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాంగ్మార్చ్ను వాయిదా వేసుకున్నట్లు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు నాగభూషణం ప్రకటించారు. త్వరలోనే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ముందుగా రాష్ట్రంలో కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీ పార్టీలు నిర్ణయించుకున్న నేపథ్యంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ఉమ్మడిగా పోరాటం చేయాలనీ ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. అందులో భాగంగానే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, రైతులకు మద్దతుగా ప్రకాశం బ్యారేజీ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు భారీ కవాతును తలపెట్టారు. ఇప్పుడు లాంగ్ మార్చ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో, ఇరుపార్టీలు సంయుక్తంగా నిర్వహించే తదుపరి కార్యక్రమాలపై స్పష్టత రావాల్సి ఉంది.
[subscribe]