తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం 107 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్స్ లలో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 107మున్సిపాలిటీలతో పాటుగా ఐజా, కొల్లాపూర్ మున్సిపాలిటీలు కూడా టిఆర్ఎస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. అలాగే ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లతో మరో ఒకట్రెండు మున్సిపాలిటీలు అధికార టిఆర్ఎస్ పార్టీ చేజిక్కుంచుకోనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏడు మున్సిపాలిటీల్లో విజయం సాధించగా, బీజేపీ పార్టీ రెండు చోట్ల, ఎంఐఎం మరో రెండు చోట్ల విజయాన్ని దక్కించుకున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఒకేరకమైన తీర్పు ఇచ్చారని, టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసున్న సంక్షేమ పథకాల వలనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ స్థాయి గెలుపు తమపై మరింత బాధ్యతను పెంచిందని సీఎం కేసీఆర్ అన్నారు. విజయం కోసం కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. జాతీయ పార్టీలకు చెంప ఛెళ్లుమనిపించేలా ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
[subscribe]