భారతదేశ నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “ఉపాధ్యాయ వృత్తితో జీవితాన్ని ప్రారంభించి నగర పంచాయతీ కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి స్థాయి వరకూ సాగిన శ్రీమతి ముర్ము గారి రాజకీయ ప్రస్థానం ఆదర్శనీయం. బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారికి ఆమె చేసిన సేవలు బహుదా ప్రశంసనీయం. శాసనసభ్యురాలిగా, ఒడిశా రాష్ట్ర మంత్రిగా, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా ఆమె నిర్వర్తించిన పదవులు, అనుభవం రాష్ట్రపతిగా రాణించడానికి ఆమెకు ఆలంబనగా నిలుస్తాయని భావిస్తున్నాను. సర్వోత్కృష్టమైన భారత రాష్ట్రపతి పదవికి ఆమె మరింత వన్నె తేవాలని, సమభావంతో చక్కటి పాలన అందించాలని నా తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రపతిగా పదవి విరమణ చేయనున్న రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సందర్భంగా జూలై 22 ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోమ్ మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షాకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అయితే తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ చారిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ సమావేశానికి వెళ్లలేకపోతున్నందుకు చింతిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. నిష్కళంకుడైన రామ్నాథ్ కోవింద్ తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనమన్నారు. ఆయన తన సేవలను అజరామరంగా నిర్వర్తించాలని, ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY