జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “మూడు వర్ణాలతో మురిపించే భారత జాతీయ పతాకం. భారతీయుల ఏకత్వానికి, శౌర్యానికి, స్వాభిమానానికి, సార్వభౌమత్వానికి, సమున్నతకి ప్రతీక. మన త్రివర్ణ పతాకాన్ని వీక్షించిన మరుక్షణం శరీరం రోమాంచితం కాని భారతీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అక్షర సత్యం. అంతటి శక్తి కలిగిన పతాకాన్ని రూపొందించిన స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య గారు చరితార్థుడు. ఆ పతాక తపశ్శాలి తెలుగు గడ్డపై జన్మించడం తెలుగు జాతి పుణ్యఫలం. ఆ మహానుభావుని 146వ జయంతి సందర్భాన నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం అందించాలని తెలుగు ప్రజల కోరిక:
“దేశం పరాయిపాలనలో అరాచకాలను చవి చూస్తున్న తరుణంలో జాతిని ఏకం చేయడానికి దేశానికి ఒక పతాకం అవసరమని ఏళ్ల తరబడి ఘోషిస్తూ, శ్రమిస్తూ చివరికి ‘ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించారు పింగళి. తుదకు 1921 మార్చిలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీజీ ఆశీస్సులతో పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతీయ పతాకంగా ఆమోదం పొందింది. ఈ ఘడియలకోసం పింగళి ఒక తపస్సునే చేశారు. విద్యాధికుడు, వ్యవసాయం, భూగర్భశాస్త్రంలో నిపుణుడు అయిన పింగళి వెంకయ్యను ఎందువల్లనో ఇటు తెలుగు రాజకీయ నాయకులు, అటు జాతీయ నాయకులు సరైన సమయంలో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించకపోవడంతో ఆర్థికంగా దుర్భరమైన జీవితాన్ని చరమాంకంలో చవిచూశారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఆ త్యాగశీలికి ‘భారతరత్న’ పురస్కారం అందించాలని తెలుగు ప్రజల కోరిక. అది ఇంతవరకు నెరవేరలేదు. దేశంలో ‘ఆజాది కా అమృతోత్సవ్’ వేడుకలు జరుగుతున్న ఈ శుభ ఘడియలలో పింగళి వెంకయ్య సేవలకు గుర్తింపుగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY